భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. రైతులు ఈ కొత్త చట్టం లోని సెక్షన్ల పై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా శుక్రవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణిలో ఉన్న సమస్యలను గుర్తించి ధరణి స్థానంలో రైతులకు మేలైన చట్టం తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దుచేసి రైతు సంఘాలు, రెవెన్యూ అధికారులు, మేధావులతో చర్చలు జరిపి ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు సంబంధించిన అన్ని భూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, వారికి భూధార్ కార్డును ఇవ్వడం జరుగుతుందన్నారు. ధరణిలో అధికారులకు అధికారాలను తొలగించడం వల్ల భూ సమస్యల పరిష్కారం నిమిత్తం రైతులు సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, భూ భారతిలో అలాంటి అవసరం లేదని తెలిపారు. కింది స్థాయి అధికారుల వద్ద పొరపాట్లు జరిగితే లేదా పని కాకపోయినా పై స్థాయి అధికారులు న్యాయం చేసే అవకాశం భూ భారతిలో ఉందన్నారు. ధరణిలో రూల్స్ లేవని, కానీ భూ భారతిలో నిర్దిష్టమైన రూల్స్ ఉన్నాయని ఆమె తెలిపారు. అధికారులు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అలాగే రైతులు సైతం భూ భారతి చట్టం అమలులో అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. భూముల సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనుందని చెప్పారు. ధరణిలో లేని అనేక వెసులుబాట్లు భూ భారతి చట్టంలో ఉన్నాయన్నారు .చట్టంలో మోకపై ఉన్న రైతులకు హక్కు ఉండాలన్నదే భూ భారతి చట్టం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. 99 శాతం కేసులు భూ భారతిలో తహసిల్దార్ వద్దనే ఉచితంగానేఉ పరిష్కారం అవుతాయన్నారు. మ్యుటేషన్లు 30 రోజుల్లో అవుతాయని, ఒకవేళ కాకపోతే పోర్టల్ లో ఆటోమేటిక్ గా 31 రోజు అవుతుందని తెలిపారు.కింది స్థాయి నిర్ణయాన్ని పై స్థాయిలో అప్పీల్ అవకాశం భూ భారతిలో ఉందన్నారు. పాత చట్టంలోని లోటు పాట్లు, కొత్త చట్టం లోని వెసులుబాట్ల గురించి కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. ఈ సదస్సులో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, సింగిల్ విండో అధ్యక్షుడు భీమ్ రెడ్డి, తహాసిల్దార్లు బక్క శ్రీనివాస్, భాస్కర స్వామి, ఎంపీడీవో శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, కోస్గి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘు వర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

