రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
నమస్తే భరత్ నిర్మల్: పట్టణంలో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకై ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 14, 2025 లోపు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించాలన్నారు. 50 వేల రూపాయల లోపు రుణం వంద శాతం మాఫీ, లక్ష రూపాయల లోపు రుణం 90 శాతం మాఫీ, లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ. 2లక్షల రూపాయల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుంది. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హులందరూ దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలన్నింటినీ మున్సిపల్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, రాజీవ్ యు వికాసం పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పలుమార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చామన్నారు. గ్రామీణ స్థాయిలో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువమంది దరఖాస్తులు చేసుకునే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, మైనార్టీ అధికారి మోహన్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

