విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నమస్తే భారత్/ నారాయణపేట్ : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. వారం రోజులలో పనితీరు మెరుగుపర్చుకుని, లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆమె ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో జిల్లాలోని ఉట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, మద్దూర్, కోస్గి మండలాల పరిధిలో ఉపాధి హామీ పథకం పనులు, వనమహోత్సవం, స్వచ్ఛభారత్ మిషన్ కు సంబంధించి ఉపాధి సృష్టించిన నివేదిక,కార్మిక సమీకరణ,గ్రామాల వారీగా లేబర్ నివేదిక,సగటు వేతన రేటు,గ్రామాల వారీగా సగటు వేతన రేటు,వన మహోత్సవం: నర్సరీలు & అంకురోత్పత్తి, 100 రోజులు పూర్తిచేసుకున్న కుటుంబాలు,సకాలంలో చెల్లింపు,ఆధార్ ఎన్ పీ సీ ఐ, తిరస్కరించబడిన లావాదేవీల పునరుత్పత్తి, జిల్లాలో మెటీరియల్ చెల్లింపు,ఎస్ బి ఎం కార్యకలాపాల పై ఎంపీడీవోలు ఎంపీవో లు ఏపీవోలు, ఈ సీ లు, టి ఏ లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ల తో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల విషయంలో అధికారులు, సిబ్బంది చాలా అలసత్వం వహిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. ఒక్కో గ్రామంలో కేవలం 8 నుంచి 10 మంది మాత్రమే ఉపాధి పనులకు రావడం ఏమిటని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోల పర్యవేక్షణ కొరవడిందని, ఎంపీవో లు, ఏపీవోలు, ఈ సిలు, టి ఏ లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవ్వరు కూడా సరిగ్గా పనిచేయడం లేదన్నారు. అధికారులు, ఉద్యోగులు మహబూబ్ నగర్ నుంచి వస్తున్నారో? ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారో అంతా తెలుసని, మంగళవారం నుంచి ఉదయం 7 గంటల వరకు గ్రామాలలో ఉండి ఉపాధి పనులకు కూలీలను అధిక సంఖ్యలో తీసుకువెళ్లి పనుల్లో వేగం పెంచాలన్నారు. వారం రోజులలో పనితీరు మెరుగు పర్చుపోకపోతే కిందిస్థాయి సిబ్బంది నుంచి పై సాయి అధికారి వరకు చర్యలు ఉంటాయన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిగతా జిల్లాలలో ఉపాధి హామీ పనులు, వనమహోత్సవం, స్వచ్ఛభారత్ మిషన్ పనులు బాగా జరుగుతున్నాయని, కానీ మన జిల్లాలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా మద్దూరు, కోస్గి, దామరగిద్ద మండలాలలో ఉపాధి హామీ పనులలో ప్రగతి ఏమీ లేదని చెప్పారు. ఎందుకింత నిర్లిప్తత ఉందని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీఓలు ఏపీవోలను కలెక్టర్ నిలదీశారు. ఉపాధి హామీ లాంటి పెద్ద పథకాన్ని వెనుకబడిన మన జిల్లాలో ఉపయోగించుకోకపోతే ఎలా ? అని, వారం తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే చర్యలు తప్పక ఉంటాయని ఆమె పునరుద్ఘాటించారు. ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, డిఆర్డిఓ మొగులప్ప పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

