రాజీరెడ్డి నగర్లో ప్రజా సమస్యలపై మన్నె రాజు ఆకస్మిక పర్యటన

సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిశీలన.. అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారానికి హామీ
కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్ ): సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని రాజీరెడ్డి నగర్లో నెలకొన్న ప్రజా సమస్యలను మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, మౌలిక వసతుల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కాలనీలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మన్నె రాజు పేర్కొన్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, శ్యామ్, గోపాల్ ముదిరాజ్, సత్తిరెడ్డి, మహిళా నాయకులు జ్యోతి రెడ్డి, కృష్ణిక్ బేగం, మహిళా కార్యకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



