ఎస్ఆర్. నాయక్ నగర్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
-డీఈ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేసిన గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరు వెంకట శేష చారి
-పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
-ట్రాన్స్ఫార్మర్ల వద్ద క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని డిమాండ్
-వర్షాకాలంలో తరచూ విద్యుత్ అంతరాయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు
-కార్యక్రమంలో పాల్గొన్న కామేశ్వర శర్మ, కిషోర్ తదితరులు
కుత్బుల్లాపూర్, జూలై 8 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 130 సుభాష్నగర్ డివిజన్ ఎస్ఆర్. నాయక్ నగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ టీఎస్ఎస్పీడీసీఎల్ కుత్బుల్లాపూర్ డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) శ్రీనివాసులను సీనియర్ నాయకుడు గుబ్బల లక్ష్మీనారాయణ, ఎస్ఆర్. నాయక్ నగర్ మాజీ అధ్యక్షుడు ఆలూరు వెంకట శేష చారి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాలనీలో కొద్దిపాటి గాలి లేదా వర్షం వచ్చినా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతున్న పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం ఉన్న పాత మెటల్ విద్యుత్ తీగలు చెట్ల కొమ్మలకు తగలడం వల్ల తరచూ ఫాల్ట్లు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలోనూ ఈ సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని పాత విద్యుత్ లైన్లను తొలగించి వాటి స్థానంలో నాణ్యమైన ఏబీ కేబుల్ (Aerial Bunched Cable) ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ల వద్ద క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేపట్టాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఈ శ్రీనివాసులను విజ్ఞప్తి చేశారు. సరైన నిర్వహణ లేకపోవడం వల్లే విద్యుత్ అంతరాయాలు అధికమవుతున్నాయని పేర్కొన్నారు. కాలనీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపించి, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని డీఈ శ్రీనివాసులు హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామేశ్వర శర్మ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



