బొడ్రాయి ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

ఆధ్యాత్మికత, సంప్రదాయాలే భారతీయ సంస్కృతికి మూలస్తంభాలని వ్యాఖ్య
కుత్బుల్లాపూర్, జూలై 11 ( నమస్తే భారత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 132వ జీడిమెట్ల డివిజన్ అంగడిపేటలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బొడ్రాయి గ్రామానికి ఆధ్యాత్మిక రక్షణ కల్పించే పవిత్ర ప్రతీక అని, గ్రామ ఐక్యత, శాంతి, సౌభాగ్యాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రామాల్లో నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో సోదరభావం, ఐక్యతను పెంపొందించి సామాజిక సామరస్యానికి దోహదపడతాయని తెలిపారు. గ్రామ ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.



