ఓటు నమోదే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది

సూరారంలో వినూత్న చైతన్య యాత్రతో ప్రజలను ఆకట్టుకున్న కోల రవీందర్ ముదిరాజ్
ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్ల నమోదుపై విస్తృత అవగాహన
ఆధార్–ఓటరు అనుసంధానంపై ముందస్తు చైతన్యం
స్వయంగా తయారు చేసిన బ్యానర్లతో వినూత్న ప్రచారం
మైకింగ్ ద్వారా కూడళ్లలో మారుమోగిన ఓటు హక్కు సందేశం
విద్యార్థుల ద్వారా ప్రతి కుటుంబానికి అవగాహన చేర్చే ప్రయత్నం
స్మార్ట్ఫోన్తో ఇంటి నుంచే ఓటరు నమోదు చేసుకోవాలని సూచన
యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లతో చైతన్య ర్యాలీl
ప్రజల ప్రశంసలు అందుకున్న సామాజిక సేవా కార్యక్రమం
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని పిలుపు
ప్రచారాన్ని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన స్థానికులు
కుత్బుల్లాపూర్, జూలై 17 ( నమస్తే భరత్ ): ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలని సామాజిక, పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సూరారం కాలనీ, బస్స్టాప్, ఫస్ట్ హోమ్ జెండా, సెకండ్ హోమ్ జెండా, సూరారం ఎక్స్రోడ్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఓటరు గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానం చేసే అవకాశాలు ఉండవచ్చని, అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న స్మార్ట్ఫోన్ ద్వారానే కుటుంబ సభ్యుల సహాయంతో సులభంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని వివరించారు. ప్రచారంలో భాగంగా స్వయంగా కాటన్ వస్త్రంపై స్కెచ్పెన్తో సందేశాలు రాసి బ్యానర్లు తయారు చేయడంతో పాటు, సొంతంగా రికార్డు చేసిన సందేశాలను మైకింగ్ ద్వారా ప్రధాన కూడళ్లలో ప్రసారం చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. పాఠశాల విద్యార్థులకు సైతం ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరిస్తూ, తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయాలని సూచించారు. ఈ చైతన్య ర్యాలీలో 60 గజాల శ్యామ్, గుట్ట అశోక్, ఆర్. లక్ష్మీనారాయణ, జి. రమేష్, రాజు, ఆంజనేయులు, దేవిరెడ్డి తదితరులతో పాటు పలువురు యువకులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. వినూత్నంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సెల్ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం విశేషంగా నిలిచింది



