మరిపెడ బంగ్లా మున్సిపాలిటీలో అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలి –
సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కి సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదని, పారిశుద్ధ్య పనులు నిర్లక్ష్యంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ముఖ్యంగా అంగడి ఆవరణ ప్రాంతం డంప్యార్డ్ను తలపించే విధంగా చెత్త పేరుకుపోయిందని, అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఉండటంతో రోగులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. అంగడి ఆవరణలో వీధి దీపాలు కూడా సరిగా పనిచేయడం లేదని తెలిపారు.అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని రామ్ విలాస్ రోడ్డు పనులను సత్వరమే పూర్తి చేయాలని, కొత్త తండా వెళ్లే రోడ్డు పనులను వేగవంతం చేయాలని, అలాగే మున్సిపల్ పరిధిలోని తండాల్లో ఇంకా అపరిష్కృతంగా ఉన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెత్త సేకరణను క్రమబద్ధీకరించడం, పారిశుద్ధ్య పనులను మెరుగుపరచడం, వీధి దీపాలను మరమ్మతు చేయడం, అన్ని అపరిష్కృత అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు.
ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.



