*సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలి*

*సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ రద్దు కోసం అధికారులకు వినతిపత్రం*
*మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదేశాల మేరకు అధికారులకు వినతిపత్రం*
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 20:షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూర్ మండలం సిద్దాపూర్ గ్రామంలో సుమారు 86 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (డంపింగ్ యార్డ్) ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి ఆదేశాల మేరకు స్థానిక నాయకులు కొత్తూర్ తహశీల్దార్ మరియు షాద్నగర్ ఆర్డీవో గార్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నె.641, తేదీ 02-07-2026 ద్వారా సిద్దాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 252, 278, 361లోని భూమిని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సదుపాయాల కోసం వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్న విషయాన్ని వినతిపత్రంలో ప్రస్తావించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో సిద్దాపూర్తో పాటు పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, భూగర్భ జలాలు, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సమీపంలోని అటవీ ప్రాంతాలు, వన్యప్రాణులు, గ్రీన్ కారిడార్, గిరిజన ఆవాసాలు, విద్యా మరియు ఆధ్యాత్మిక సంస్థలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా సిద్దాపూర్ ప్రాంతంలో ఉన్న హెచ్ పి సి ఎల్ ఎల్ పి జి పైప్లైన్ మరియు సెక్షనలైజింగ్ వాల్వ్ స్టేషన్ వంటి కీలక మౌలిక వసతుల భద్రతపై కూడా సమగ్ర అధ్యయనం నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇంత పెద్ద స్థాయిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సరికాదని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను నిలిపివేసి, సమగ్ర శాస్త్రీయ, పర్యావరణ అధ్యయనాలు నిర్వహించి నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని నాయకులు అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పెంటనోళ్ళ యాదగిరి, మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్, సర్పంచ్ లలిత గోపాల్ నాయక్, మాజీ సర్పంచులు మిట్టు నాయక్, రమేష్, మాజీ ఎంపీటీసీ వడ్డె బాలయ్య, మాజీ కౌన్సిలర్ ప్రసన్నలత యాదయ్య, నాయకులు మిట్టు నాయక్, రవి కుమార్, బుచ్చిబాబు, రాములు నాయక్, లక్ష్మణ్ నాయక్, కోట్య నాయక్, జంగయ్య, గోపి నాయక్, బిచ్య నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



