గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ బలోపేతమే లక్ష్యం
-‘గో టు విలేజ్’ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్లో ముఖ్య నాయకుల సమావేశం
-జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపు
-పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు వెల్లడి
-ఎస్సీ వర్గీకరణ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన
-విద్య, ఉద్యోగ రంగాల్లో మాదిగ యువత ముందుకు రావాలని ఆకాంక్ష
-ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపు
కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే భరత్ ): పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టిన ‘గో టు విలేజ్’ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయ ఆవరణంలో గల గార్డెన్లో ఎమ్మార్పీఎస్–మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్పీ) ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జి తిప్పరపు లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశపాగ రాంచందర్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి సిల్వర్ శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ ద్వారా లభించిన అవకాశాలను మాదిగ యువత సద్వినియోగం చేసుకుని విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
జూలై 7న జరగనున్న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, అదే రోజున మహాజన నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను కూడా భారీ ఎత్తున నిర్వహించేలా కార్యాచరణ చేపట్టాలని నాయకులకు సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో నాయకులు ముందుండి పనిచేయాలని ఆయన కోరారు.
సంస్థ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, యువతను పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ ఉపాధ్యక్షుడు రాసమల్ల యాదగిరి మాదిగ, మాదిగ యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసురం రమేష్, మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నడిమిదొడ్డి సలోమి, మహాజన సోషలిస్టు పార్టీ నాయకురాలు ఆరెకటిక జ్యోతి, బాచుపల్లి మండల అధ్యక్షుడు ఏసన్న మాదిగ, విజయ్ మాదిగ, ఎర్రోళ్ల రామకృష్ణ మాదిగ, రాజేందర్ పిల్లై, మాదిగ విద్యార్థినులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



