ePaper
Saturday, July 4, 2026
ePaper
Homeఎడిటోరియల్మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి

మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి
సైబరాబాద్ కమిషనర్‌కు సీఐటీయూ వినతిపత్రం

-8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్

-జీహెచ్ఎంసీ కార్మికుల తరహాలోనే నిజాంపేట్ సర్కిల్ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి

-భద్రతా పరికరాలు, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని కోరిన సీఐటీయూ

-సమస్యలు పరిష్కరించకపోతే భారీ ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక

-ప్రగతి నగర్‌లో కమిషనర్ పర్యటన సందర్భంగా వినతిపత్రం సమర్పణ

-కార్మికుల సంక్షేమమే ప్రజా ఆరోగ్యానికి పునాది అని సీఐటీయూ నేతల వ్యాఖ్య

బాచుపల్లి, జూలై 2 ( నమస్తే భరత్ ): ప్రగతి నగర్‌లో పర్యటించిన సైబరాబాద్ కమిషనర్‌కు మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ బాచుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ బాచుపల్లి మండల కన్వీనర్ రాథోడ్ సంతోష్, మండల సీనియర్ నాయకుడు వెంకటరామయ్య మాట్లాడుతూ, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు మున్సిపల్ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ వారికి తగిన వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు, భద్రతా పరికరాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. వినతిపత్రంలో ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనాన్ని వెంటనే అమలు చేయాలని, గత ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు అందిస్తున్న వేతనాలనే నిజాంపేట్ సర్కిల్‌లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కూడా అమలు చేయాలని కోరారు.
అదేవిధంగా కార్మికులకు అవసరమైన చీపుర్లు, షూస్, గ్లోవ్స్, సబ్బులు, నూనెలు, డ్రైనేజీ పనిముట్లు, ఇతర భద్రతా సామగ్రిని క్రమం తప్పకుండా అందించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించకుండా వారి అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. డిమాండ్లపై ప్రభుత్వం, అధికారులు సానుకూలంగా స్పందించకపోతే మున్సిపల్ కార్మికులను సమీకరించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు బాలాపేర్, పి. స్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!