జయశంకర్ ఆశయ సాధనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

-మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టరేట్లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
-జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి నివాళి
-జయశంకర్ ఆశయాలను ప్రతి ఉద్యోగి ఆదర్శంగా తీసుకోవాలి
-ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి
-జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు
– ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది
కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంత బలాన్ని అందించిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో ముందుకు సాగాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సమాజం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిర్దేశించిన విలువలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి పౌరుడు ఆయనను ఆదర్శంగా తీసుకుని నిబద్ధతతో పనిచేస్తే అదే ప్రొఫెసర్ జయశంకర్కు అందించే నిజమైన నివాళి అవుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలతి, లా ఆఫీసర్ చంద్రావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.



