రైతు రుణాలపై వన్టైమ్ సెటిల్మెంట్ అమలు చేయాలి
వివిధ బ్యాంకులు రైతులకు అండగా నిలవాలి – సిపిఐ
సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో నిర్వహించిన రైతుల సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ మండలంలోని రైతులు వివిధ బ్యాంకుల నుండి తీసుకున్న పంట రుణాల భారంతో తీవ్ర ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రభుత్వం రెండు లక్షల రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేసిన నేపథ్యంలో, రెండు లక్షల రూపాయలకు పైబడిన రుణాలు కూడా మాఫీ అవుతాయనే ఆశతో అనేక మంది రైతులు తమ రుణాలను సకాలంలో చెల్లించలేకపోయారని తెలిపారు. అయితే రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో అసలు రుణాలకు భారీ వడ్డీలు చేరి రైతులపై అదనపు ఆర్థిక భారం పడిందన్నారు.రుణ బకాయిల కారణంగా రైతుల ఖాతాలపై హోల్డ్లు విధించడంతో రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తదితర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే పెట్టుబడి సాయం కూడా రైతులకు పూర్తిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, పెరిగిన సాగు ఖర్చులు, దిగుబడులు తగ్గిపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వివిధ బ్యాంకులు మానవతా దృక్పథంతో వ్యవహరించి రైతుల పంట రుణాలపై వన్టైమ్ సెటిల్మెంట్ (OTS) అమలు చేసి, వడ్డీలలో రాయితీలు కల్పించి రైతులకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతులు ఒకేసారి మొత్తం బకాయిలు చెల్లించే పరిస్థితిలో లేరని, అందువల్ల బ్యాంకులు ప్రత్యేక చర్యలు తీసుకొని రైతులకు ఉపశమనం కల్పించాలని కోరారు. ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో లక్ష్మణ్, వీరన్న, భగవత్, దీపక్, రాములు తదితరులు పాల్గొన్నారు.



