విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి!

పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఒకేసారి విడుదల చేయాలి
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవంతమైన ‘చలో కలెక్టరేట్’
నమస్తే భారత్ షాద్ నగర్, జులై 23:రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపుమేరకు రంగారెడ్డి జిల్లాలో ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చౌహాన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. “హలో విద్యార్థి.. చలో కలెక్టరేట్” అనే నినాదంతో విద్యార్థి హక్కుల సాధన కోసం నాయకులు, విద్యార్థులు కదలివచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్ చౌహన్, సామిడి వంశీ వర్ధన్ రెడ్డి లు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా, గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను విడతల వారీగా కాకుండా, మొత్తం నిధులను ఒకేసారి విడుదల చేయాలని స్పష్టం చేశారు. బకాయిలు రాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను ఒకేసారి విడుదల చేసి విద్యార్థులను ఆదుకోకపోతే, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విద్యార్థుల పక్షాన రాజీలేని పోరాటం చేసిన ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, పత్లావత్ ఆకాష్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు భుక్యా వినోద్ నాయక్, జిల్లా నాయకురాలు పార్వతి, మండల నాయకులు జూనొతల భాను ప్రకాష్, ఆందోజు నిఖిల్, వెంకట్ దుర్గా ప్రసాద్, చందు, క్రిష్, అరవింద్, మధు, హర్షిత్, గణేష్, తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



