బౌరంపేట్ అభివృద్ధికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాదయాత్ర
ప్రజా సమస్యలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన


➤ బౌరంపేట్ సమగ్రాభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం
➤ సీఆర్ఎంపీ ప్రధాన రహదారి అభివృద్ధికి జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆదేశాలు
➤ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచన
➤ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం
➤ తాగునీరు, అంతర్గత రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి హామీ
➤ వేగంగా విస్తరిస్తున్న కాలనీల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
➤ ప్రజాప్రతినిధులు వినిపించిన సమస్యలను క్షుణ్ణంగా ఆలకించిన ఎమ్మెల్యే
➤ పాదయాత్రలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 5 ( నమస్తే భారత్ ): దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్ ప్రాంత సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బుధవారం అధికారులతో కలిసి విస్తృత పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకుంటూ, క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. పాదయాత్ర సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు సీఆర్ఎంపీ ప్రధాన రహదారి దెబ్బతిన్న పరిస్థితి, భూగర్భ డ్రైనేజీ సమస్యలు, ట్రాఫిక్ రద్దీ, మౌలిక వసతుల కొరత తదితర అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని తెలిపారు. డీపీఎస్ స్కూల్–బొడ్రాయి మధ్యనున్న సీఆర్ఎంపీ ప్రధాన రహదారి భారీ వాహనాల రాకపోకలతో తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఈఈ రత్నాకర్లతో ఫోన్లో మాట్లాడి వెంటనే అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారి మరమ్మతులతో పాటు దీర్ఘకాలిక పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. భారీ వాహనాల కారణంగా రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేలా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న మురుగునీటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పాదయాత్రలో డిప్యూటీ కమిషనర్ వెంకట మణికిరణ్, ఈఈ సుబ్రహ్మణ్యం, డీఈ పాపమ్మ, ఏఈ సురేందర్ నాయక్, డీజీఎం ప్రమీలా, ఏఈ వెంకటేష్, విద్యుత్ ఏఈ సాయి కిరణ్, పోలీసు అధికారులు, పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, బెంబడి బుచ్చిరెడ్డి, నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాదాసు వెంకటేష్, విష్ణువర్ధన్ రెడ్డి, మురళీ యాదవ్, హనుమంత్ రావు, సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, ధర్మారెడ్డి, సాయిరెడ్డి, మన్నె శేఖర్ ముదిరాజ్, సాంబశివ రెడ్డి, బొబ్బ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.



