శంభీపూర్ రాజును పరామర్శించిన హరీశ్ రావు, మహిపాల్ రెడ్డి

ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
శంభీపూర్ నివాసానికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు
కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్ ): వరంగల్ జిల్లాలోని కన్నెపల్లి రిజర్వాయర్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును సోమవారం పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి హరీశ్ రావు శంభీపూర్లోని రాజు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా శంభీపూర్ రాజు నివాసానికి చేరుకుని పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు శంభీపూర్ రాజును కలిసి పరామర్శించి సంఘీభావం తెలిపారు.



