బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీకి కమ్యూనిటీ హాల్ వరం

-రూ.45 లక్షలు మంజూరు… నిర్మాణ పనులకు శ్రీకారం
-కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన కోలన్ హన్మంత్ రెడ్డి
-కాలనీ ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక
-ప్రభుత్వానికి, కోలన్ హన్మంత్ రెడ్డికి కాలనీ వాసుల కృతజ్ఞతలు
బాచుపల్లి, జులై 8 విజన్ ఆంధ్ర: బాచుపల్లి సాయి నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో నివాసితుల చిరకాల కోరిక నెరవేరింది. కాలనీలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.45 లక్షలు మంజూరు చేయగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి కృషి ఫలితంగా ఈ నిధులు లభించినట్లు స్థానికులు తెలిపారు. బాల బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు బుధవారం కోలన్ హన్మంత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో నివసించే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి వస్తే కాలనీ ప్రజలు సమావేశాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు కోలన్ హన్మంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ నివాసితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



