ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై జోనల్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ

-జీడిమెట్ల సర్కిల్లో బి ఎల్ ఓ ల పనితీరును పరిశీలించిన పింకేష్ కుమార్, ఐఏఎస్
-ఇంటింటి సర్వే, ఓటరు వివరాల ధృవీకరణను వేగవంతం చేయాలని ఆదేశం
-అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచన
-పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సవరణ ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం
కుత్బుల్లాపూర్, జూన్ 26 ( నమస్తే భరత్ ): 045–కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల సర్కిల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని శుక్రవారం జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOలు), బి ఎల్ ఓ సూపర్వైజర్లు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల ధృవీకరణ, సవరణ ప్రక్రియ పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణను పూర్తి పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల వివరాల సవరణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వేను వేగవంతం చేసి, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలపై అధికారులతో నేరుగా చర్చించి, ఎదురవుతున్న సమస్యలు, పురోగతిని తెలుసుకున్న జోనల్ కమిషనర్, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జీడిమెట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి. శంకర్ సింగ్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, బి ఎల్ ఓ సూపర్వైజర్ జవహర్లాల్తో పాటు సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.



