- రూ.14 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఇద్ధరు అరెస్ట్
నర్సంపేట ఆగస్టు 6 (నమస్తే భారత్ ) :
నర్సంపేట పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ఒడిశా రాష్ట్రం నుంచి భద్రాచలం–మహబూబాబాద్–నర్సంపేట మీదుగా హైదరాబాద్కు బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో పోలీసులు మహబూబాబాద్ బైపాస్ రోడ్డుపై మాటువేసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన బొలెరో వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న ముగ్గురిలో ఒకరు అక్కడి నుంచి పరారవగా, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బొలెరో వాహనం కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య బాక్సుల్లో గంజాయిని దాచిపెట్టి తరలిస్తున్నట్లు వారు వెల్లడించారు. తహసీల్దార్ సమక్షంలో వాహనంలోని రహస్య బాక్సులను తెరిచి పరిశీలించగా, మొత్తం 28 కిలోల ఎండు గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే రెండు సెల్ఫోన్లు, బొలెరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితులను అమృత బైద్యాయ్, పుజూర్ రాయ్, ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుని భారీ పట్టివేత చేసిన నర్సంపేట పోలీసు బృందాన్ని నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి అభినందించారు. అరెస్టు చేసిన నిందితులను గురువారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.



