ప్రొ. జయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి దిక్సూచి

బౌరంపేట్లో జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ
ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిదని పిలుపు
దుండిగల్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): ప్రజల ఆకాంక్షలే ఏ ఉద్యమానికైనా అసలైన బలమని, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ వార్డులో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, స్వీయ పాలన, ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. జయశంకర్ చూపిన మార్గంలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జయశంకర్ సార్ ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయడం సమాజం మొత్తంపై ఉన్న బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ విలువలను పరిరక్షిస్తూ ప్రజల ఆకాంక్షల సాధనకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సాంబశివ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, వేముల శ్రీనివాస్, ధర్మారెడ్డి, బాల్ రెడ్డి, సాయిరెడ్డి సురేందర్ రెడ్డి, టి.ఎస్. రెడ్డి, నర్సింహారెడ్డి, మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, బెంబడి బుచ్చిరెడ్డి, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మురళీ యాదవ్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు రంగారాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు బాలాజీ నాయక్, గాజుల సుజాత, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



