జరుపుల అక్షిత్కు ఏదైనా జరిగితే ఫెర్టిలైజర్ షాప్ యజమాని,అధికారులదే పూర్తి బాధ్యత
నిషేధిత గడ్డి మందు విక్రయించిన వారిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి
అక్షిత్కు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
చర్యలు తీసుకోకపోతే భారీ ధర్నాకు దిగుతాం
ఎల్హెచ్పీఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భూక్య రామ్మూర్తి నాయక్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపులో ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందును విక్రయించడం వల్ల బీచ్రాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జరుపుల తండాకు చెందిన జరుపుల అక్షిత్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడని,ఈ ఘటనకు బాధ్యులైన ఫెర్టిలైజర్ షాప్ యజమానితో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్హెచ్పీఎస్ (లంబాడ హక్కుల పోరాట సంఘం) జిల్లా అధ్యక్షుడు భూక్య రామ్మూర్తి నాయక్ డిమాండ్ చేశారు.శుక్రవారం మరిపెడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిషేధిత గడ్డి మందును అభం శుభం తెలియని పిల్లవాడికి విక్రయించడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన షాప్ యజమానిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.మండలంలోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో నిషేధిత మందులువిక్రయించబడుతున్నాయని,దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రతి నెలా ఫెర్టిలైజర్.షాప్.యజమానులతో సమావేశాలు నిర్వహించి నిషేధిత మందుల విక్రయాన్ని అరికట్టే చర్యలు చేపట్టాలని.సూచించారు.ఒకవైపు యువతను మంచి మార్గంలో నడిపించేందుకు, మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంచేందుకు పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కృషి చేస్తోందని, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందనే సందేశాన్ని ఇస్తోందన్నారు. అయితే కొంతమంది యువత క్షణికావేశానికి లోనై ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలు, నమ్మకాన్ని ఒక్క క్షణంలో చెదరగొట్టే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజమంతా బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో నిషేధిత పురుగుమందులను విక్రయించే వారిపై కఠిన చట్టాలు అమలు చేసి, నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువత క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళనకరమని, అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని అన్నారు.జరుపుల అక్షిత్కు ఏదైనా అపాయం జరిగితే ఆ కుటుంబానికి పూర్తిస్థాయి నష్టపరిహారాన్ని ఫెర్టిలైజర్ షాప్ యజమాని భరించాలని, అలాగే సంబంధిత అధికారులను కూడా బాధ్యులను చేయాలని ఎల్హెచ్పీఎస్ డిమాండ్ చేసింది. లేదంటే సంఘం ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించింది.ప్రస్తుతం చికిత్స పొందుతున్న అక్షిత్ త్వరగా కోలుకోవాలని సేవాలాల్ మహారాజ్ను ప్రార్థిస్తున్నట్లు భూక్య రామ్మూర్తి నాయక్ తెలిపారు.ఈ సమావేశంలో తేజావత్ మోహన్ నాయక్, గుగులోతు కవిత, రాజు నాయక్, బావా సింగ్ నాయక్, మంగీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



