కార్మిక హక్కుల కోసం జూలై 18న భారీ గర్జన

కనీస వేతనాల అమలే లక్ష్యంగా సీఐటీయూ బహిరంగ సభకు పిలుపు
-జీవో నెం. 06 ప్రకారం కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్
-ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
-శాస్త్రీయ విధానం లేకుండా కనీస వేతనాల జీవో విడుదలైందని విమర్శ
-వి.డి.ఏ పాయింట్ రేటు నిర్ణయంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన
-ప్రగతి నగర్లో సీఐటీయూ బాచుపల్లి మండల కమిటీ సమావేశం
-భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి జె. చంద్రశేఖర్ పిలుపు
బాచుపల్లి, జూలై 14 ( నమస్తే భరత్); కార్మికుల కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కుల సాధన కోసం ఈ నెల జూలై 18న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రగతి నగర్లోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సీఐటీయూ బాచుపల్లి మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 06 ప్రకారం కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధమైన సంక్షేమ సౌకర్యాలు కల్పించడంతో పాటు, యాజమాన్యాలు కార్మికులపై కొనసాగిస్తున్న వేధింపులను వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ట్రేడ్ యూనియన్లు కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ ప్రమాణాలను పక్కనపెట్టి అతి తక్కువ వేతనాలతో జీవో విడుదల చేసిందని చంద్రశేఖర్ విమర్శించారు. అలాగే వి.డి.ఏ (వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్) లెక్కింపులో మార్చి–2001 సిరీస్ను ఆధారంగా తీసుకుని పాయింట్ రేటును తక్కువగా నిర్ణయించడం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే కనీస వేతనాలను శాస్త్రీయ విధానంలో సవరించి, కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో జూలై 18న జరిగే భారీ బహిరంగ సభలో పారిశ్రామిక కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ సీనియర్ నాయకులు బి. వెంకట రామయ్య, బాచుపల్లి మండల కమిటీ సభ్యులు నాగభూషణ్, పెంటయ్య, ఎల్లమ్మ, స్వామి, భాస్కర్, వెంకట్ స్వామి, నాగరాజు, ఏడుకొండలు, డేవిడ్, పవన్, సతీష్, శ్రీను, మదిలేటి, చెన్నయ్య, మనీ, బుజ్జమ్మ, నాగశేషు, తిరుపతయ్య, అంజి, లక్ష్మీతో పాటు పలువురు కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.



