ప్రమాదకర విద్యుత్ స్థంభాలు తొలగించాలి
-దెబ్బతిన్న స్థంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని వినతి
-విద్యుత్ శాఖ సహాయ డివిజనల్ ఇంజినీర్కు వినతిపత్రం
-ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి
-దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ ఆధ్వర్యంలో నాయకుల వినతి
దుండిగల్, జులై 13 ( నమస్తే భరత్ ); 296 డివిజన్ పరిధిలోని దుండిగల్, నాగులూరు, దుండిగల్ తండా–ఒకటి, దుండిగల్ తండా–రెండు, గగిల్లాపూర్, చర్చ్ గగిల్లాపూర్, రెండువందల పద్నాలుగు కాలనీ, శంభిపూర్, మహేశ్వరం, కేవీఆర్ కాలనీ ప్రాంతాల్లో దెబ్బతిన్న, వంగిపోయిన, రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగించి, అవసరమైన చోట కొత్త విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేయాలని కోరుతూ దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ ఆధ్వర్యంలో నాయకులు విద్యుత్ శాఖ సహాయ డివిజనల్ ఇంజినీర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మండల ప్రాదేశిక సభ్యుడు వీరబత్తిని నరేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ కావలి గణేష్, దొంతి మహేష్ ముదిరాజ్, దత్తు రాజ్ యాదవ్ మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో అనేక విద్యుత్ స్థంభాలు శిథిలావస్థకు చేరి వంగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొన్ని చోట్ల విద్యుత్ స్థంభాలు రహదారులకు అడ్డంగా ఉండటంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలివానలు, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో దెబ్బతిన్న విద్యుత్ స్థంభాలు కూలిపోయే ప్రమాదం అధికంగా ఉందని, దీనివల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్థంభాలను వెంటనే తొలగించి, వాటి స్థానంలో కొత్త స్థంభాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రహదారులకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగించి, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా సురక్షిత ప్రాంతాల్లో పునఃస్థాపన చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు అత్యవసరంగా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని నాయకులు విద్యుత్ శాఖ అధికారులను కోరారు.



