అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా గ్రీన్ రిసార్ట్..?
పట్టుబడిన పేకాట రాయుళ్ళు
నర్సంపేట జూలై 11(నమస్తే భారత్ ) :
నర్సంపేట పట్టణ శివారులో గల గ్రీన్ రిసార్ట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా గ్రీన్ రిసార్ట్ లో పేకాట ఆడుతున్న కొంతమంది పోలీసులకు పట్టుబడడం ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.
గ్రీన్ రిసార్ట్ లో ఆరుగురు పేకాట రాయుళ్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. నర్సంపేట ఎస్ ఐ అరుణ్ కుమార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరు ఖానాపురం మండలానికి చెందిన వారిగా గుర్తించారు. తమ్మిశెట్టి సురేష్, వీరమనేని.సాగర్, శాఖమూరి వెంకటేశ్వరరావు ,వీ. బద్రూ, జె. రమేష్ సహా సర్వపురానికి చెందిన వేముల కృష్ణ రెడ్డి గా గుర్తించారు. నిందితుల నుండి 6 సెల్ ఫోన్లు, 3 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
అనుమతులు లేవు :
గ్రీన్ రిసార్ట్ పై కొంత కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. సదరు బిల్డింగ్ లకు అనుమతులు లేవు, నిబంధనలు పాటించడం లేదంటూ నర్సంపేట మున్సిపల్ అధికారులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గ్రీన్ రిసార్టు నోటీసులు అందజేశారు. అయినప్పటికీ అనుమతి పత్రాలు మున్సిపల్ అందజేయలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రెండో నోటీసు సైతం అందజేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా… గ్రీన్ రిసార్ట్ వ్యవహారం పట్ల స్థానికంగా చర్చ జరుగుతోంది.



