ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరచాలి.
– ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి
-గాలివారిగూడెం, అమృతండా గ్రామపంచాయతీలలో సర్వేలో.
-సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య
నమస్తే భారత్ :-మరిపెడ
ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మరిపెడ
మండలంలోని గాలివారిగూడెం, అమృ నాయక్.తండా,గ్రామపంచాయతీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సిపిఐ(ఎం) బృందం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఎదుర్కొంటున్న సమస్యలను బృందం దృష్టికి తీసుకొచ్చారు. గాలివారిగూడెం యూపీఎస్ పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉండగా నలుగురు ఉపాధ్యాయుల పోస్టులు మంజూరైనప్పటికీ ఇద్దరిని డిప్యూటేషన్పై ఇతర పాఠశాలలకు పంపడంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి డిప్యూటేషన్లను రద్దు చేయాలని వీరయ్య డిమాండ్ చేశారు.పాఠశాల ఆవరణలో శిథిలావస్థకు చేరిన పాత భవనం ప్రమాదకరంగా మారిందని, అందులో గబ్బిలాలు చేరి విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని ఉపాధ్యాయులు వివరించారు. దీనిపై పలుమార్లు పై అధికారులకు ప్రతిపాదనలు పంపినా వారు స్పందించలేదని తెలిపారు. వెంటనే ఆ భవనాన్ని కూల్చివేసి కొత్త తరగతి గదులు నిర్మించాలని కోరారు.అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద నిర్మించిన మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని వెంటనే నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణ మధ్యలో వెళ్లే విద్యుత్ తీగలను భద్రత దృష్ట్యా వేరే మార్గానికి మళ్లించాలని కూడా కోరారు.



