జిల్లా క్రీడల్లో మేడ్చల్కు అగ్రస్థానం లక్ష్యంగా సమష్టి కృషి
జీడిమెట్ల జెడ్పీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయ సమావేశం
➡️ వ్యాయామ ఉపాధ్యాయులు ఐక్యంగా పనిచేయాలని జిల్లా విద్యాధికారి రేణుక పిలుపు
➡️ రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్ష
➡️ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహణ
➡️ జిల్లా క్రీడల కార్యదర్శి గోనె అరుణ జ్యోతి అధ్యక్షతన కార్యక్రమం
➡️ క్రీడల నిర్వహణ, విద్యార్థుల ప్రతిభాభివృద్ధిపై విస్తృత చర్చ
➡️ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాలోని వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 5 ( నమస్తే భారత్ ): మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీడిమెట్లలో బుధవారం వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయ సమావేశం ఘనంగా నిర్వహించారు. జిల్లా క్రీడల కార్యదర్శి గోనె అరుణ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా విద్యాధికారి శ్రీమతి రేణుక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రేణుక మాట్లాడుతూ జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులందరూ సమన్వయంతో, ఒకే లక్ష్యంతో పనిచేస్తే జిల్లా స్థాయి క్రీడలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రస్థాయిలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా క్రీడాకారులు అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ ప్రతిభావంతులను వెలికితీయడంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. జిల్లా క్రీడల కార్యదర్శి గోనె అరుణ జ్యోతి మాట్లాడుతూ రానున్న పాఠశాల క్రీడా పోటీల నిర్వహణ, సమన్వయం, క్రీడాకారుల ఎంపిక, పోటీలను పారదర్శకంగా నిర్వహించే అంశాలపై ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలంటే ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీబీ కార్యదర్శి విజయ రెడ్డి, జీడిమెట్ల జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కళ్యాణి, జోనల్ కార్యదర్శులు విద్యాసాగర్, శంకర్, యాదయ్య, సత్తిరెడ్డి, రాధిక, మనోహర్, పారిజాత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.



