సహకార స్ఫూర్తితో రైతు అభివృద్ధికి సమష్టి కృషి

-ఆల్వాల్లో సహకార వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం
-సహకార చట్టాలు, రైతులకు లభించే ప్రయోజనాలపై అవగాహన
-ఎఫ్పీఓ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని పిలుపు
– పాల్గొన్న జిల్లా సహకార శాఖ అధికారులు, సంఘం ప్రతినిధులు
కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల సందర్భంగా ఆల్వాల్లోని సిండికేట్ ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సంఘం ఆధ్వర్యంలో రైతులకు సహకార వ్యవస్థపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. సురేఖ రాణి మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి సభ్యుల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. సహకార నియమాలు, చట్టాలపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలను సమర్థవంతంగా పొందవచ్చని తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీఓ) సభ్యత్వ నమోదును వేగవంతం చేసి మరింత మంది రైతులను సంఘటితం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి జి. శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ తోట గోపాల్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆర్.ఎం.వి. ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు. వారు సహకార సంఘాల ద్వారా రైతులకు అందుతున్న సేవలు, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు, సహకార వ్యవస్థ బలోపేతం అవసరంపై రైతులకు వివరించారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై సహకార రంగానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.



