జర్నలిస్టుల సంక్షేమ హామీలు వెంటనే అమలు చేయాలి
మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ భారీ ధర్నా

-అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తక్షణమే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్
-హెల్త్ కార్డులు, పిల్లల విద్యా ఫీజు రాయితీలు, ఇంటి స్థలాల హామీల అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆగ్రహం
-మీడియా స్వేచ్ఛను పరిరక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
-హామీలు అమలు కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక
-జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన జర్నలిస్టు నాయకులు
-పెద్ద సంఖ్యలో పాల్గొన్న జర్నలిస్టులు, ఫెడరేషన్ నాయకులు
కుత్బుల్లాపూర్, జులై 13 ( నమస్తే భరత్ ); తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రకటించిన సంక్షేమ హామీలను తక్షణమే అమలు చేయాలని, మీడియా స్వేచ్ఛను పరిరక్షించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆలస్యం లేకుండా అమలు చేయాలని కోరారు. ధర్నాలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.కె. సలీమా, గుమ్మడి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బనావత్ రవి నాయక్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు వెంటనే అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, పెండింగ్లో ఉన్న హెల్త్ కార్డులను అందించాలని, జర్నలిస్టుల పిల్లలకు విద్యా ఫీజుల్లో రాయితీలు కల్పించాలని, ఇంటి స్థలాల పంపిణీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా, నియోజకవర్గ ఇన్చార్జులు, ఫెడరేషన్ నాయకులు, వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.



