విద్యుత్ లీకేజీతో యువకుడి మృతి
బాలానగర్ టీ-జంక్షన్ వద్ద అర్థరాత్రి విషాదం
➤ చెరకు రసం దుకాణం వద్ద విద్యుత్ లీకేజీ గుర్తించిన విద్యుత్ శాఖ అధికారులు
➤ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు
➤ మృతుడి వయస్సు 28–30 సంవత్సరాల మధ్యగా అంచనా
➤ మృతుడి వివరాలు తెలిసిన వారు బాలానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
కుత్బుల్లాపూర్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ-జంక్షన్ వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో 28 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. సమీపంలోని శ్రీ మల్లికార్జున షుగర్కేన్ జ్యూస్ షాప్ వద్ద విద్యుత్ లీకేజీ కారణంగా యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చెరకు రసం దుకాణంలోని విద్యుత్ కనెక్షన్లో లీకేజీ ఉన్నట్లు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి గుర్తింపునకు పోలీసులు చర్యలు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతన్ని గుర్తించగలిగిన వారు వెంటనే బాలానగర్ పోలీసులను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇచ్చారు: బాలానగర్ పోలీస్ స్టేషన్: 8712663209, ఎస్ఐ వినోద్: 8712663202, ఎస్హెచ్ఓ, బాలానగర్: 8712663200



