జగద్గిరిగుట్ట ప్రభుత్వ పాఠశాలకు రక్షణ కల్పించాలి…ప్రజావాణిలో సీపీఐ
వినతి – సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక
-ప్రజావాణిలో జోనల్ అధికారులకు సీపీఐ వినతిపత్రం
-జగద్గిరిగుట్టలో రోడ్డు ఆక్రమణలు, అక్రమ పార్కింగ్ తొలగించాలని డిమాండ్
-ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని విజ్ఞప్తి
-గత ఫిర్యాదులపై స్పందించని అధికారుల తీరుపై ఆగ్రహం
-సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే ఉద్యమం తప్పదని హెచ్చరిక
-ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యమని అధికారులకు గుర్తుచేసిన సీపీఐ
కుత్బుల్లాపూర్, జులై 27 ( నమస్తే భరత్ ): జగద్గిరిగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తగిన రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రాంతీయ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో అధికారులను కలిసి జగద్గిరిగుట్ట, గాజులరామారం డివిజన్లకు సంబంధించిన సమస్యలపై వినతిపత్రాన్ని ఈఈ గోవర్ధన్, బద్రి తదితర అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉమామహేష్ మాట్లాడుతూ, రెండు వారాల క్రితం నిర్వహించిన ప్రజావాణిలో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్కు జగద్గిరిగుట్టలో రోడ్డు ఆక్రమణలు తొలగించడం, ఫుట్పాత్ నిర్మాణం చేపట్టడం, గాజులరామారం డివిజన్లో దెబ్బతిన్న రహదారులను మరమ్మతు చేయడం వంటి సమస్యలపై వినతిపత్రం సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో ప్రజలు సమస్యలు వినిపించినా అధికారులు స్పందించకపోతే ఆ కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. జగద్గిరిగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ తక్కువ ఎత్తులో ఉండటంతో రాత్రి వేళల్లో, సెలవు దినాల్లో ఆకతాయిలు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి విద్యా వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ ఎత్తును పెంచి పాఠశాలకు పూర్తి రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడకపోతే రానున్న రోజుల్లో ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్, మండల కార్యదర్శి స్వామి, సహాయ కార్యదర్శులు హరినాథరావు, రాములు, యువజన సంఘం నాయకులు కీర్తి, ప్రవీణ్, ఇమామ్, జంబులు తదితరులు పాల్గొన్నారు.



