మియాపూర్ రహదారి విస్తరణకు శ్రీకారం
మంత్రి శ్రీధర్బాబు క్షేత్రస్థాయిలో పరిశీలన

-బౌరంపేట ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కోకా-కోలా కంపెనీ వరకు రహదారి విస్తరణ
-అటవీ భూమి పరిధిలో పనులకు అధికారులతో సమీక్ష
-భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు
-ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలే ప్రభుత్వ లక్ష్యం
-కార్యక్రమంలో పాల్గొన్న సైబరాబాద్ మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు
దుండిగల్, జులై 27 ( నమస్తే భరత్ ); :దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కోకా-కోలా కంపెనీ వరకు ఉన్న మియాపూర్ రహదారి (అటవీ భూమి పరిధి)లో చేపట్టనున్న రహదారి విస్తరణ పనులను రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి ఇరువైపులా చేపట్టనున్న విస్తరణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, నగర అభివృద్ధి, పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. శ్రీజన (ఐఏఎస్), కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ (ఐఏఎస్), డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్, ప్రముఖులు కొలను హనుమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, భూపతి రెడ్డి, పీసరి మహేందర్ రెడ్డి, బొంగునూరి కిషోర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ (ఎస్డబ్ల్యూఎం) అన్వేష్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ పాపమ్మ, ఏసీపీ శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్ సురేందర్ నాయక్, అశోక్ కుమార్తో పాటు సర్కిల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



