షాద్ నగర్ – ఫరూఖ్ నగర్ లో ఘనంగా ఖురాన్ పోటీల బహుమతి ప్రదానోత్సవం

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్13:రంగారెడ్డి జిల్లా షాద్నగర్–ఫరూఖ్నగర్లోని అంజుమన్ ఫంక్షన్ హాల్లో వార్షిక కేంద్ర ఖురాన్ పోటీల బహుమతి ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తహ్రీక్ ముహబ్బాన్-ఎ-ముస్తఫా ఆధ్వర్యంలో, మదరసా జియా ఉల్ బషీర్, మొహమ్మద్ ఆఫ్జల్ ఖాద్రి సహకారంతో కార్యక్రమం జరిగింది. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అల్ హాజ్ హాఫెజ్ మహమ్మద్ అలీముద్దీన్ మాట్లాడుతూ, ఖురాన్ విద్య విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు నైతిక విలువలను పెంపొందిస్తుందని అన్నారు. జ్ఞానార్జనకు ఇస్లాంలో ఎంతో ప్రాధాన్యత ఉందని, విద్యార్థులు మతపరమైన విద్యతో పాటు మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఖాజీ సయ్యద్ ముక్తదిర్ అలీ, మౌలానా హాఫెజ్-ఓ-ఖారీ సయ్యద్ మునవ్వర్ అలీ, ఇమామ్ ఆగాజ్ ఆలం, ఖాజీ సయ్యద్ అన్వర్, మొహమ్మద్ కాజా (డిఎక్స్), సీనియర్ జర్నలిస్టులు మన్సూర్ అలీ ఖాన్, ముహమ్మద్ ఇలియాస్, ఖలేద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, మతపెద్దలు, ముస్లిం సమాజ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



