చలో కలెక్టరేట్కు భవన నిర్మాణ కార్మికులు భారీగా తరలిరావాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి పిలుపు
నమస్తే భారత్ :-మరిపెడ
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “చలో కలెక్టరేట్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి ముందుగా మరిపెడ మండలంలోని పలు గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులను కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం స్థానిక గెస్ట్ హౌస్లో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు కొండ ఉప్పులయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సమ్మెట రాజమౌళి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు కోటి మంది భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి కోసం కష్టపడుతున్నప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తూ జారీ చేసిన జి.ఓ. నెం.12ను వెంటనే రద్దు చేసి, సంక్షేమ పథకాలను ప్రభుత్వమే నేరుగా అమలు చేయాలని కోరారు.
అలాగే సీఎంసీ హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేసి, కార్మికులందరికీ హెల్త్ కార్డులు అందజేయాలని, సహజ మరణ పరిహారాన్ని ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న 54 వేల క్లెయిమ్లను తక్షణమే పరిష్కరించాలని, 55 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి నెలకు రూ.6,000 పింఛన్ ఇవ్వాలని, కార్మికుల పిల్లలకు విద్యా స్కాలర్షిప్లు మంజూరు చేయాలని కోరారు.
భవన నిర్మాణ కార్మికుల అడ్డాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే నియమించాలని, సెస్ నిధులను పూర్తిగా కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. 2009 నుంచి రెన్యువల్ కాకుండా పెండింగ్లో ఉన్న 13 లక్షలకు పైగా లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని, భవన నిర్మాణ కార్మికులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
గత ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు అందించాలని, లేబర్ కార్డు కలిగిన కార్మికుడు ఏ రాష్ట్రంలో మరణించినా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, వలస కార్మికుల పేర్లను నమోదు చేసి వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడు భాగస్వామి కావాలని, సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సమ్మెట రాజమౌళి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి దుండి వీరన్న, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కొండ ఉప్పులయ్య, సురబోయిన బిక్షం, శంకర్, వెంకన్న, బిక్కు యాదగిరి, సైదులు తదితరులు పాల్గొన్నారు.



