తప్పిపోయిన మహిళను కుటుంబానికి చేర్చిన పేట్ బషీరాబాద్ పోలీసులు

-మతిస్థిమితం లేక తిరుగుతున్న మహిళను గుర్తించిన స్థానికులు
-ఆశ్రమంలో చికిత్స అనంతరం వెల్లడైన అసలు వివరాలు
-భర్తను గుర్తించి సురక్షితంగా అప్పగించిన పోలీసులు
-పోలీసుల మానవత్వానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు
కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి తప్పిపోయిన ఓ మహిళను గుర్తించి, ఆమెకు చికిత్స అందించి చివరకు కుటుంబ సభ్యులను గుర్తించి అప్పగించడం ద్వారా పేట్ బషీరాబాద్ పోలీసులు తమ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో అపర్ణ పామూరు ప్రాంతంలో ఓ మహిళ మతిస్థిమితం లేకుండా తిరుగుతుండటాన్ని స్థానికులు గమనించి డయల్-100కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పేట్ బషీరాబాద్ పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె ఎలాంటి సమాచారం చెప్పలేకపోయింది.
అనంతరం పోలీసులు కేవీ రెడ్డి నగర్, గుండ్లపోచంపల్లి పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టినా ఆమెకు సంబంధించిన ఆచూకీ లభించలేదు. దీంతో అదే రోజు సాయంత్రం షామీర్పేట్లోని మాతృశ్రీ అనాథ ఆశ్రమంలో ఆమెను చేర్పించి వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. చికిత్స అనంతరం మహిళ తన పేరు పింకీ బై గోసాయి (30) అని, తన భర్త పేరు బబ్బులు (35) అని తెలిపింది. తాము వికార్బాద్ జిల్లా తాండూరు గాంధీనగర్కు చెందినవారమని వెల్లడించింది. ఈ నెల 16వ తేదీన ఇంటి నుంచి తప్పిపోయి వచ్చినట్లు తెలిపింది. వెంటనే పోలీసులు ఆమె భర్తను సంప్రదించి ఆశ్రమానికి పిలిపించారు. అవసరమైన ధృవీకరణ ప్రక్రియ అనంతరం మహిళను భర్తకు సురక్షితంగా అప్పగించారు. తన భార్యను క్షేమంగా అప్పగించిన పేట్ బషీరాబాద్ పోలీసులకు కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పేట్ బషీరాబాద్ పోలీసుల తక్షణ స్పందన, మానవతా దృక్పథం, సేవా భావాన్ని స్థానికులు అభినందించారు.



