ePaper
Monday, June 15, 2026
ePaper
Homeఎడిటోరియల్అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం

అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం

📰 Generate e-Paper Clip

అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం

జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

ఎస్ఓటీ–జీడిమెట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్ విజయవంతం

చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేవని గుర్తింపు

జోగిపేట డిపోర్టేషన్ కేంద్రానికి తరలింపు

అక్రమ వలసదారులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసుల హెచ్చరిక

కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): అక్రమ వలసదారులపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న జీడిమెట్ల పోలీసులు మరో కీలక విజయాన్ని నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం, నిఘా వర్గాల నుంచి అందిన పక్కా ఆధారాల మేరకు ఎస్ఓటీ కూకట్‌పల్లి జోన్ సిబ్బంది, జీడిమెట్ల పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, గజులరామారం–జీడిమెట్ల పరిధిలోని హెచ్ఏఎల్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో కొందరు విదేశీయులు అనుమానాస్పదంగా నివసిస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అక్కడ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించగా, భారతదేశంలో నివసించేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేదా ఇతర ప్రయాణ అనుమతి పత్రాలు ఎవరి వద్దా లేవని తేలింది. ప్రాథమిక దర్యాప్తులో వారు అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో కుత్బుల్లాపూర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు సంబంధిత చట్టాల ప్రకారం వారిపై నిర్బంధ, కదలికల నియంత్రణ చర్యలు అమలు చేశారు. అనంతరం వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలించారు. సంబంధిత అధికారుల ధృవీకరణ, చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం వారిని బంగ్లాదేశ్‌కు బహిష్కరించి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
అక్రమ వలసలు, విదేశీయుల చట్టవిరుద్ధ నివాసాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న పోలీసు శాఖ, ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు, ప్రత్యేక ఆపరేషన్లు భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో జీడిమెట్ల పోలీసు బృందం, ఎస్ఓటీ సిబ్బంది అప్రమత్తత, నిఘా సామర్థ్యం, సమన్వయ కృషి కీలక పాత్ర పోషించాయని ఉన్నతాధికారులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!