గడపగడపకు బీజేపీ.. 21వ రోజుకు సంకల్పయాత్ర

జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఇంటింటికీ చేరిన పార్టీ నాయకులు
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన
కుత్బుల్లాపూర్, జూన్ 10 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “గడపగడపకు బీజేపీ – సంకల్పయాత్ర” విజయవంతంగా 21వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు కొల్లు మాధవి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి నాయకత్వంలో పార్టీ శ్రేణులు కాలనీలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారంతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే సంకల్పయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేర్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సాయినాథ్ నేత, రచ్చ చక్రధర్, యాదగిరి యాదవ్, నరేష్ గౌడ్, రమాదేవి, సరోజిని, మురళి, సిద్ధిరాములు, సత్యనారాయణ, కార్తీక్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

