పాముకాటుతో మహిళ మృతి
ఖానాపురం ఆగష్టు12 (నమస్తే భారత్ ) :
పాముకాటుతో మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం ఖానాపురం మండల కేంద్రంలో నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం…ఖానాపురం మండల కేంద్రంలోని టేకుల తండాకు చెందిన బానోతు విజయ(38) తమకు ఉన్న గొర్రెలను మేత కోసం తీసుకెళ్లింది. ఇంటి పరిసరాల్లో గొర్రెలను మేపే క్రమంలో పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కాగా మృతురాలికి భర్త రమేష్, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



