మూడు దశాబ్దాల ఉద్యమ ఫలితమే ఎస్సీ వర్గీకరణ
– సూరారంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
– పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్
– జెండా ఆవిష్కరణతో ఉద్యమ స్ఫూర్తిని చాటిన నాయకులు
– విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు సాగాలని పిలుపు
కుత్బుల్లాపూర్, జూలై 7 ( నమస్తే భరత్ ): ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం సూరారం మెయిన్ రోడ్డులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్–బాబు జగ్జీవన్ రామ్ భవనం సమీపంలో ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాసమల్ల యాదగిరి మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సిలివేరి శ్రీనివాస్ మాదిగ, జిల్లా మాదిగ మహిళా సమాఖ్య నాయకురాలు నడిమిదొడ్డి సలోమి మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మూడు దశాబ్దాలపాటు సాగిన నిరంతర ఉద్యమ ఫలితంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ చారిత్రక అవకాశాన్ని మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు సద్వినియోగం చేసుకుని విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మరింత పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చేందుకు యువత చైతన్యవంతంగా ముందుకు రావాలని, సామాజిక న్యాయం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఇందూరం తిరుపతి మాదిగ, సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీ మహేష్ మాదిగ, జిల్లా యువసేన ప్రధాన కార్యదర్శి ఇస్తాం రమేష్ మాదిగ, మట్ట నరసింహులు, వేణుగోపాల్, జాన్సన్ మాదిగ, ఆశీర్వాదం మాదిగ, పారిశుద్ధ్య కార్మికులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



