సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో సర్పంచ్ల పాత్ర కీలకం
జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
నర్సంపేట, జూలై 10(నమస్తే భారత్ ) :
గ్రామపంచాయతీలలో సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక ను సమర్థవంతంగా రూపొందించి అమలు చేయడంలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.నర్సంపేటలో సిటిజన్ క్లబ్ లో శుక్రవారం గ్రామపంచాయతీ–సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళికపై సర్పంచ్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామాభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని తెలిపారు.
ప్రస్తుతం సమగ్ర ఓటరు ఇంటింటి సర్వే లో సర్పంచ్ లు ముందుగా మీరు ఓటరు ఫారం నమోదు చేసి డిజిటల్సిజేషన్ చేయించుకోవాలని ,తద్వారా ప్రజల సందేహాలను కూడా నివృత్తి చేయగలరని కలెక్టర్ పేర్కొన్నారు.రైతులకు రానున్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచనలు పాటిస్తూ పంట మార్పిడి పంటలు వేయాలని, నీటి తక్కువ వినియోగం తో పండించే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.భూగర్భ జలాలను ఇంకిపోకుండా ఉండేందుకు ఇంకుడు గుంతల ఏర్పాటు చేసుకోవాలన్నారు.ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలను నిర్వహించి, పారదర్శకంగా ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి,జడ్పి సీఈఓ రామ్ రెడ్డి,నర్సంపేట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతి హర్షిత, ఆర్డీవో ఉమా రాణి, డిఆర్డిఓ నాగ పద్మజ, సంబంధిత శాఖల అధికారులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.



