ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం


సామాజిక సేవలో భాగంగా సామాన్యులకు ఉచిత వైద్య సేవలు
నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం
సుమారు 100 మందికి వైద్య పరీక్షలు.. 25 మందికి రక్త పరీక్షలు
అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ
గోగులపాటి కృష్ణమోహన్
సూరారం, ఆగస్టు 13: ( నమస్తే భరత్ ); సామాజిక సేవలో భాగంగా సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సుభాష్నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీలో గల లూయిస్ బ్రెయిలీ భవన్లో గురువారం ఈ శిబిరం జరిగింది. నా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గోగులపాటి కృష్ణమోహన్ జన్మదినాన్ని పురస్కరించుకుని సీఎమ్మార్ హాస్పిటల్, కండ్లకోయ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ “సాహిత్యస్య వికాసాయ, రక్షణాయ చ సంస్కృతేః | సామాజిక హితార్థాయ, నా సంస్థా వర్తతే చిరం ||” అనే ధ్యేయంతో సాహిత్య వికాసం, సామాజిక శ్రేయస్సు, సాంస్కృతిక పరిరక్షణ లక్ష్యాలతో నా ఫౌండేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామాజిక సేవ, సాహిత్య వికాసం, సాంస్కృతిక పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా ఫౌండేషన్ తన వంతు కృషి చేస్తుందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరంలో సుమారు 100 మంది వరకు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు 25 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సలహాలు, సూచనలు అందించడంతో పాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన సమయంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసబుల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజయ్య, సీఎమ్మార్ హాస్పిటల్ పీఆర్వో దుర్గాప్రసాద్, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సలహాదారు రమేష్ సర్వేపల్లి, సంఘం సభ్యులు గడ్డం రాంబాబు, శ్రీధరాచార్యులు, నరేందర్ రెడ్డి, యాదయ్య, రాము, శేఖర్ గౌడ్, సీఎమ్మార్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ప్రవల్లిక, కోఆర్డినేటర్ రాజ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.



