ప్రజాపాలన దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్,
(నమస్తే భరత్)
మెదక్: సెప్టెంబర్ 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వేదిక, ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్, జాతీయ పతాకావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని సూచించారు. హాజరయ్యే ప్రజలు, అధికారులు, సిబ్బందికి తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పోలీస్ గౌరవ వందనం, బందోబస్తు పటిష్టంగా చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



