తల్లిపాలు –శిశువుకు తొలి టీకా, తొలి ఆహారం, జీవితాంతం ఆరోగ్యానికి బలమైన పునాది.


డాక్టర్ స్రవంతి వైద్య అధికారి,
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 03:సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో డాక్టర్ స్రవంతి గారి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం లో భాగంగా తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ప్రతి సంవత్సరము ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తాము అని, ఈ వారవోత్సవం ముఖ్య ఉద్దేశము తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుందని మరియు ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, మొదటి 6 నెలలు వరకు శిశువుకు తల్లిపాలు తప్పకుండా పట్టించాలి అని చెప్పారు. పాప పుట్టిన వెంటనే వచ్చే మురుపాలు శిశువుకు తొలి. టికా వంటివని, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని తెలియజేశారు. తల్లిపాలు తాగే పిల్లలకు విరేచనాలు, నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువ అని, శిశువు మెదడు ఎదుగుదలకు,శారీరక మరియు మానసిక అభివృద్ధికి తల్లిపాలు ఎంతో అవసరమని, తల్లి బిడ్డల మధ్య ప్రేమ అనుబంధం మరింత బలపడుతుందని, తల్లిపాలు ఎల్లప్పుడూ పరిశుభ్రమైనవి అని, ఈ పాలు సరైన ఉష్ణోగ్రతలో ఉంటాయని, వీటికి ఎలాంటి ఖర్చు ఉండదని డాక్టర్ స్రవంతి గారు తెలియజేశారు. తల్లి పాపకు పాలు ఇవ్వడం వలన ప్రసవం తర్వాత గర్భాశయం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుందని, ప్రసవానంతరo రక్తస్రావం తగ్గుతుందని,రొమ్ము క్యాన్సర్లు, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని మరియు తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేశారు. మరియు శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ప్రారంభించాలని, మొదటి ఆరు నెల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని, నీరు లేదా ఇతరహారము అవసరము లేదని డాక్టర్ స్రవంతి చెప్పారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భవతులందరూ అంగన్వాడి సెంటర్ లో ఇచ్చే బాలామృతము, గుడ్లు మరియు మురుకులు తప్పకుండా తీసుకొని, తినాలని తెలియజేశారు. వీటివలన తల్లికి , బిడ్డకు కావలసిన పోషకాహారం అందుతుందని చెప్పారు. హెల్త్ సూపర్వైజర్ శ్రీ రామ మాట్లాడుతూ తల్లులందరూ పాప పుట్టిన వెంటనే మరుపాలు తప్పకుండా తాపించాలని, కాన్పు అయిన తర్వాత పిల్లలందరికీ వ్యాధినిరోధక టీకాలు తప్పకుండా ఇప్పించాలని తెలియజేశారు. తరువాత హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు మాట్లాడుతూ గర్భవతులు అందరూ కూడా పోషకాహారము భుజించాలి అని, గర్భవతులు మామూలుగా స్త్రీలు తీసుకునే ఆహారము కంటే ఎక్కువ హారము, ఎక్కువసార్లు కొద్దికొద్దిగా తీసుకోవాలని, ఎందుకు అనగా తల్లికి మరియు గర్భంలో ఉన్న శిశువుకు శక్తి కావాలంటే ఎక్కువ హారం తీసుకోవాలని చెప్పారు. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్డు వంటి పోషక ఆహారాలు తీసుకోవాలని, పోషకాహారము తీసుకోవడం వలన కాన్పు సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగమని తల్లీ, బిడ్డ క్షేమంగా ఉంటారని హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ శ్రీ రమ, ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడి టీచర్ పుష్ప , ఏఎన్ఎం లు మధువాణి , లలిత , ఆశలు, గర్భవతులు మరియు బాలింత తల్లులు పాల్గొన్నారు.



