జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో భారీ ఊరట
ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పాత్రికేయుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ
2026-27 విద్యా సంవత్సరానికి జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాలు
మెద్చల్–మల్కాజిగిరి జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపు
అమలుపై మండల విద్యాశాఖ అధికారులకు డీఈవో ఆదేశాలు
కుత్బుల్లాపూర్, జూన్ 15 (నమస్తే భారత్ ): మెద్చల్–మల్కాజిగిరి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు విద్యా పరంగా ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50 శాతం వరకు రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్–ఐజేయూ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా నాయకత్వాలు చేసిన వినతుల మేరకు జిల్లా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా విద్యాధికారి (డీఈవో) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మెద్చల్–మల్కాజిగిరి జిల్లాలోని అన్ని ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలు జర్నలిస్టుల పిల్లలకు సాధ్యమైనంత గరిష్ఠ స్థాయిలో ఫీజు రాయితీ అందించాలని సూచించారు. ఈ రాయితీ 2026–27 విద్యా సంవత్సరానికి వర్తించనుంది. అలాగే, జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవోలు) ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డీఈవో ఆదేశించారు. సంబంధిత ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు కూడా ఈ ఆదేశాల ప్రతులను పంపినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పాత్రికేయ కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

