ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు

-131వ డివిజన్లో ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాల పరిశీలన
-అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు కావాలని అధికారులకు సూచనలు
-సహాయ కమిషనర్, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి తనిఖీలు
నిర్వహించిన నాయకులు
-ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని అవగాహన
కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 131వ డివిజన్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026 కార్యక్రమాన్ని మంగళవారం సంబంధిత సహాయ కమిషనర్, జీహెచ్ఎంసీ పర్యవేక్షకుడు, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులతో కలిసి సీనియర్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర న్యాయ విభాగం కన్వీనర్, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మొహమ్మద్ జాకీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాల ధృవీకరణ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు కావడంతో పాటు, వివరాల్లో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని, అందరూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.



