NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 7:02 pm Posted by : NAMASTHE BHARAT

చదువుల కోసం పంపితే.. చాకిరీ చేయిస్తారా?

*చదువుల కోసం పంపితే.. చాకిరీ చేయిస్తారా?*

 

*షాద్‌నగర్‌ ఎస్సీ సమీకృత హాస్టల్‌లో విద్యార్థులతో వంట సామగ్రి సరఫరా*

 

*ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?*

 

*ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆకాష్ నాయక్*

 

నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్04:విద్యార్థులకు విద్యతో పాటు భద్రమైన వాతావరణం కల్పించాల్సిన హాస్టల్‌లో వారితోనే పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. షాద్‌నగర్‌ పట్టణంలోని ఎస్సీ సమీకృత హాస్టల్‌లో కూరగాయలు, పండ్లు, గుడ్లు, ఇతర వంట సామగ్రిని తరలించే పనుల్లో విద్యార్థులను వినియోగిస్తున్నారని ఏఐఎస్ఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ఆకాష్‌ నాయక్‌ ఆరోపించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ….హాస్టల్‌ నిర్వహణలో భాగంగా అవసరమైన సరుకులను తీసుకురావడం, తరలించడం వంటి పనులను సిబ్బంది చేయాల్సిఉండగా..విద్యార్థులతోనే ఆ పనులు చేయించడం సరికాదని ఆకాష్‌ నాయక్‌ అన్నారు. విద్యార్థులు చదువుకోవాల్సిన సమయంలో వారితో పనులు చేయించడం నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు.

సరఫరా చేసే క్రమంలో ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?

విద్యార్థులు వంట సామగ్రిని తరలించే క్రమంలో అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. చిన్న నిర్లక్ష్యం కూడా విద్యార్థుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్‌కు పంపేది చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆశతోనే తప్ప పనులు చేయడానికి కాదని పేర్కొన్నారు. హాస్టల్‌లో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను పరిశీలించాలని ఏఐఎస్ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.