రూ.10.90 కోట్లతో దూలపల్లి–జీడిమెట్ల రహదారి అభివృద్ధికి శ్రీకారం


– మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా శంకుస్థాపన
– ప్రజల విజ్ఞప్తితో నిధుల కోసం నిరంతర కృషి ఫలితం
– రెండు కిలోమీటర్ల రహదారి ఆధునికీకరణతో వేలాది మందికి ఊరట
– నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
– ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీశైలం గౌడ్
– పారిశ్రామిక సంస్థల ప్రతినిధుల ఘన సన్మానం
కుత్బుల్లాపూర్, జూలై 7 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మంగళవారం దూలపల్లి గ్రామం నుంచి జీడిమెట్ల పారిశ్రామిక వాడకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి ఆయన పనులను ప్రారంభించారు. నాలుగు నెలల క్రితం స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు పూర్తిగా దెబ్బతిన్న ఈ రహదారిని శ్రీశైలం గౌడ్ స్వయంగా పరిశీలించారు. అనంతరం రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. సంబంధిత శాఖల అధికారులకు, మంత్రులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసి నిరంతరం అనుసరణ చేపట్టారు. ఆయన కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.10.90 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసి నిధులు విడుదల చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో మంగళవారం పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, గత పదేళ్లలో ఈ రహదారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. రహదారి దెబ్బతినడంతో ఉద్యోగులు, కార్మికులు, స్థానిక ప్రజలు నిత్యం ప్రమాదాలకు గురయ్యారని పేర్కొన్నారు. ఇకపై పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ రహదారి పూర్తయితే దూలపల్లి గ్రామ ప్రజలతో పాటు జీడిమెట్ల పారిశ్రామిక వాడకు నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, వాహనదారులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. రహదారి నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, గతంలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా పనిచేసిన సందీప్ కుమార్ ఝా (ఐఏఎస్), ప్రస్తుత సంబంధిత కమిషనర్ సృజన (ఐఏఎస్)లకు శ్రీశైలం గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జీడిమెట్ల పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, భాస్కర్ గౌడ్, మోహన్ రావు, కావలి గోపాల్, నాగేశ్వరరావు, రంగారావు, చాంద్ పాషా, మల్లేష్, వెంకటేశ్, అశోక్, సుదర్శన్ రెడ్డి, నవీన్, ఉపేందర్ రెడ్డి, ఖదీర్, అయ్యప్ప కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.