NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 12:12 pm Posted by : NAMASTHE BHARAT

కాంగ్రెస్‌లో 40 ఏళ్ల సేవకు గుర్తింపు ఎక్కడ..? ఆవుల సర్వేశ్వరరావుకు పదవి ఇవ్వాలని కార్యకర్తల డిమాండ్

కాంగ్రెస్‌లో 40 ఏళ్ల సేవకు గుర్తింపు ఎక్కడ..? ఆవుల సర్వేశ్వరరావుకు పదవి ఇవ్వాలని కార్యకర్తల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే భారత్ బ్యూరో (మూర్తి):

 

దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకు తగిన గుర్తింపు లభించడం లేదనే విమర్శలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పినపాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆవుల సర్వేశ్వరరావుకు ఇప్పటివరకు సరైన పదవి దక్కకపోవడంపై ఆయన అనుచరులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆవుల సర్వేశ్వరరావు పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేశారని కార్యకర్తలు పేర్కొంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలు, ఎన్నికల సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ, అవసరమైతే జైలుకు కూడా వెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఆయనకు గుర్తింపు రాకపోవడం బాధాకరమని అంటున్నారు.
జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పార్టీకి అండగా నిలిచిన నాయకుడిగా ఆవుల సేవలు విశేషమని కార్యకర్తలు చెబుతున్నారు. అయితే పదవుల కేటాయింపులో ఆయన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
రానున్న మండల కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆవుల సర్వేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించాలని ఆయన అనుచరులు పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. అర్హత, అనుభవం, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న నాయకులకు ప్రాధాన్యం కల్పిస్తే కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం స్పందించి ఆవుల సర్వేశ్వరరావుకు తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పించాలని కాంగ్రెస్ కార్యకర్తలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.