NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 9:39 pm Posted by : NAMASTHE BHARAT

రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో అపరిశుభ్ర శౌచాలయాలు – విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా

*రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో అపరిశుభ్ర శౌచాలయాలు – విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా?*

*నిర్లక్ష్య తీరుపై ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ సెక్రటరీ శ్రీకాంత్ ఆగ్రహం*

*ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో అధికారుల వైఫల్యమని విమర్శ*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్20:విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన ప్రభుత్వ పాఠశాలల్లోనే అపరిశుభ్రత రాజ్యమేలుతుండటం ఆందోళన కలిగించే అంశమని ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ సెక్రటరీ శ్రీకాంత్ మండిపడ్డారు.ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.పాఠశాలలో శౌచాలయాలు అపరిశుభ్రంగా ఉండడం, తాగునీటి సౌకర్యాలు తగిన స్థాయిలో లేకపోవడం,విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిశీలించిన శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. పాఠశాలల పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరిగాయని వాటిని తొలగించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.పాఠశాల అడుగడుగునా నిర్లక్ష్యం వెంటాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో నీటి సమస్య అధికంగా ఉందని విద్యార్థులు తమతో చెప్పారని , ఆ సమస్యను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వాలు విద్యా రంగ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా అందించలేకపోవడం బాధాకరమని అన్నారు.ముఖ్యంగా బాలికల కోసం పరిశుభ్రమైన శౌచాలయాలు లేకపోవడం వారి విద్యాభ్యాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాలలు కేవలం విద్య బోధించే కేంద్రాలు మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఆలయాలని పేర్కొన్న ఆయన, అలాంటి చోట్ల అపరిశుభ్రత నెలకొనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.విద్యార్థులు అనారోగ్య సమస్యలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడితే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, శౌచాలయాల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు పరిశుభ్రమైన మరియు సురక్షితమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని కోరారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలల్లోనే అపరిశుభ్రత ఉంటే అది కేవలం నిర్లక్ష్యం కాదు.భావితరాల ఆరోగ్యంతో చెలగాటమే అని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు.విద్యార్థుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం, అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టౌన్ వైస్ ప్రెసిడెంట్ అదిల్ ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్ రామ్ చరణ్, సోహెల్,సన్నీ, చింటూ తదితరులు పాల్గొన్నారు.