ఓటర్ల జాబితా సవరణపై బీఎల్ఏలకు శిక్షణ

దుండిగల్ సర్కిల్, గండిమైసమ్మ మండలంలో అవగాహన సదస్సు
జూన్ 25 నుంచి ఇంటింటి గణన ప్రారంభం
జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
దుండిగల్, జూన్ 20 ( నమస్తే భరత్ ): దుండిగల్ సర్కిల్, గండిమైసమ్మ మండల పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏలు) ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని శనివారం మేకల వెంకటేశం ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గండిమైసమ్మ మండల తహసీల్దార్ రాజేశ్వర్రెడ్డి హాజరై బీఎల్ఏలకు ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటర్ల జాబితా పారదర్శకతను కాపాడడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్ఏలు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ఓటర్ల జాబితా నాణ్యతను మెరుగుపరచడంలో సహకరించాలని కోరారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి గణన నిర్వహించనున్నట్లు తెలిపారు. జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారని, అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తారని చెప్పారు. అనంతరం అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవగాహన సదస్సులో వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.