NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 2:34 pm Posted by : NAMASTHE BHARAT

ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, స్థలం దక్కే వరకు పోరాటం కొనసాగుతుంది: సీపీఐ

ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, స్థలం దక్కే వరకు పోరాటం కొనసాగుతుంది: సీపీఐ

-ఇందిరాపార్క్‌లో వామపక్షాల రాష్ట్రస్థాయి ధర్నాకు కుత్బుల్లాపూర్ నుంచి భారీగా తరలివచ్చిన సీపీఐ శ్రేణులు

-ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలపై ఆగ్రహం

-ఇల్లు, ఇంటి స్థలం లేని పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్

-కుత్బుల్లాపూర్‌లో వేలాది నిరుపేదలకు గృహహక్కు కల్పించే వరకు ఉద్యమం

-ప్రజలను సమీకరించి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం

-ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపు

 

కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్): రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం, సొంత ఇల్లు లభించే వరకు తమ పోరాటం ఆగదని సీపీఐ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇప్పటికే స్థలాలు ఉన్న వారికి యాజమాన్య పట్టాలు అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన రాష్ట్రస్థాయి ధర్నా కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉమా మహేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇల్లు లేని వారికి ఇళ్లు, స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇస్తామని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. పేదల గృహహక్కును నిర్లక్ష్యం చేసే ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వేలాది కుటుంబాలు ఇప్పటికీ సొంత ఇల్లు, ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలను సమీకరించి జిల్లావ్యాప్తంగా దశలవారీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పేదల గృహహక్కు కోసం ప్రభుత్వం తక్షణమే సమగ్ర కార్యాచరణ రూపొందించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాలు, గృహ పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు నరసింహారెడ్డి, నాయకులు కృష్ణ, వెంకటేష్, బక్కరి మల్లేష్, నాగేష్, ఇమామ్, నరసయ్య, ముసలయ్య, యాదగిరి, కొండయ్య, యువజన నాయకులు కీర్తి, ప్రవీణ్, మహేష్, వంశీ, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.